విశాఖ, గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నుంచి మూడు రోజుల పాటు విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం నాడు ఆయన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తారు. అచ్యుతాపురంలో ధవళేశ్వరం మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అదేరోజు అచ్యుతాపురం నుంచి నేరుగా తునికి వైఎస్ జగన్ వెళ్తారు. సముద్రంలో గల్లంతైన ఏడుగురు పెరుమాళ్లపురం, హుకుంపేట మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపట్నం, రామన్నపాలెంలో ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలను ఓదారుస్తారు. ఆరోజుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకినాడలో బస చేస్తారు.
జూలై 3న కాకినాడలోని పరాడపేట, ఉప్పలంక, పగడాలపేటలో ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలను ఓదారుస్తారు. అదేరోజు రంపచోడవరం నియోజకవర్గం వెళ్లి, అక్కడ సూరంపాలెం పెళ్లిబృందం ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. అదేరోజు హైదరాబాద్కు తిరిగి వస్తారు.