మహిళల కన్నీళ్లు తుడవాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను అమలు చేయకుండా డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను సీఎం చంద్రబాబు మోసగించారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర సాగించిన సందర్భంలో ఎదురైన పలు సంఘటనలను గుర్తుచేస్తూ ఆయన శనివారం ట్విటర్లో స్పందించారు. ‘‘చంద్రబాబు చేసిన మోసం కారణంగా అప్పుల్లో కూరుకుపోయి మహిళ కంట తడిపెడుతోంది.
ఎలాగైనా చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి డ్వాక్రా చెల్లెమ్మలను గౌరవించాల్సిన అవసరం ఉంది’’ అని జగన్ ట్వీట్ చేశారు. అలాగే.. ‘‘ఉద్యోగాలిస్తాం.. లేదంటే నిరుద్యోగ భృతిని చెల్లిస్తాం అని ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోకుండా చంద్రబాబు నిరుద్యోగ యువకులనూ మోసం చేశారు. ఈ విషయంలో అందరూ కలసికట్టుగా చంద్రబాబు మెడలు వంచి ఆ హామీ అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది’’ అని ఉద్యోగం లేక ఒక యువతి కంట తడిపెడుతూ తన బాధను వ్యక్తం చేస్తున్న సంఘటనపై జగన్ మరో ట్వీట్ చేశారు.