'భారీ మెజార్టీతో గెలిపించండి... కేంద్రమంత్రిగా తీసుకు వస్తా'

'భారీ మెజార్టీతో గెలిపించండి... కేంద్రమంత్రిగా తీసుకు వస్తా' - Sakshi


మరో 15 రోజుల్లో మన తలరాతలు మార్చే ఎన్నికలొస్తున్నాయి... ఏ వ్యక్తి అయితే పేదవాడి గుండె చప్పుడు వింటాడో, అలాంటి వ్యక్తికే ఓటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు హితవు పలికారు. ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు... ఎలా బతికామన్నది దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరూపించారని అందుకే ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఎన్నికల నేపథ్యంలో అమలుకాని హామీలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు.



మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని సాకుగా చూపి గ్రామగ్రామాన బెల్ట్ షాపులను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదని ఆరోపించారు. రూ. లక్షా 50 కోట్లతో రుణాలు మాఫీ చేస్తానని... నెరవేరని హామీలతో ముందుకు వస్తున్నాడని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఇంటోకో ఉద్యోగం చొప్పున మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలిస్తానని చెబుతూ... పట్టపగలే ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇప్పుడు ఇస్తున్న హామీలు గతంలో సీఎంగా ఉండగా ఎందుకు అమలు చేయలేకపోయారంటూ చంద్రబాబును జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.


 


చంద్రబాబులా తాను అబద్దం చెప్పనని జగన్ స్పష్టం చేశారు. విశ్వసనీయత గల రాజకీయాలే తనకు తెలుసునని జగన్ తెలిపారు. తాను ఇచ్చిన హామీలన్ని చేసి చూపిస్తానని జగన్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే రాష్ట్ర దశ, దిశ మార్చే అయిదు సంతకాలు చేస్తానని ప్రజలకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి మేకపాటి రాజమోహన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను జగన్ కోరారు. కేంద్రమంత్రిగా మేకపాటి రాజమోహన్ రెడ్డిని మీ ముందుకు తీసుకొస్తానని నెల్లూరు జిల్లా ప్రజలకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top