రైతు దీక్ష ప్రారంభించిన వైఎస్ జగన్
తణుకు : ఎన్నికల హామీలను గాలి కొదిలేసిన అధికార పార్టీ రైతులను, మహిళలను వంచిస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమబాట పట్టింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రైతు దీక్ష చేపట్టారు. రెండురోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు.
ముందుగా ఆయన దీక్షా స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షకు విచ్చేసిన వారికి వైఎస్ జగన్ అభివాదం చేసి దీక్షలో కూర్చున్నారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా గత ఎనిమిది నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టనున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంశాల్లో ప్రభుత్వ కప్పదాటు వైఖరితో ఇతరత్రా సర్కారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై వైఎస్ఆర్ సీపీ గత నవంబర్లో మూడు దశల ఆందోళనలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే.