బాబు మంచోడు..కేంద్రం, ఆర్బీఐ చెడ్డవట!
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో రెండోరోజు పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆయన అనంతపురం, కల్యాణదుర్గం నియోజకవర్గ నేతలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే వైఎస్ఆర్ సీపీనే అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. అధికారం కోసం ఏ గడ్డైనా తిన పద్ధతి మంచిది కాదని, సీఎం పదవి కోసం మోసం చేయాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ అన్నారు.
చంద్రబాబు రోజుకో అబద్ధంతో పాలన సాగిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. డ్వాక్రా మహిళల వడ్డీ తానే చెల్లిస్తాననడం సిగ్గుచేటు అని, వాస్తవానికి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తున్నారని, లేని వడ్డీని ఎలా కడతారో చంద్రబాబే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్న బాబు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నారన్నారు. రుణాల మాఫీపై ప్రభుత్వ కాలయాపన వల్ల కొత్త రుణాలు మంజూరు కాలేదన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలన్నారని...జాబు ఇవ్వలేకపోతే రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో నిలదీస్తే నేనెప్పుడు చెప్పానంటూ బాబు తప్పుకున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 43 లక్షల 11వేల పెన్షన్లు ఉన్నాయని, కొత్తగా 15 లక్షల మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వృద్ధులకు 1000, వికలాంగులకు 1500 పెన్షన్ అందాలంటే రూ.3700 కోట్లు అవసరమన్నారు. బడ్జెట్లో మాత్రం రూ. 1338 కోట్లు మాత్రమే కేటాయించిందని వైఎస్ జగన్ అన్నారు. 135 జీవో ఆధారంగా పెన్షన్లను ఎలా కత్తిరించాలో ప్రభుత్వం చూస్తోంది. అమ్మహస్తం పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.
చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 మద్దతు ఇస్తున్నాయని, బాబు చెప్పే ప్రతి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు మంచోడు..కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులు చెడ్డవని ప్రచారం చేస్తాయని వైఎస్ జగన్ అన్నారు. బాబుకు లేనిది...మనకు ఉన్నది విశ్వసనీయతే అని ఆయన వ్యాఖ్యానించారు. బాబు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేద్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.