మంత్రి పదవుల నుంచి బయటకు రాలేం కదా...
న్యూఢిల్లీ: ఏపీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే మూడుసార్లు కేంద్ర మంత్రులను కలిశామని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రేపు కూడా మంత్రులను కలుస్తామని చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో 'అడగ గలుగుతాం అంతేకానీ... మంత్రి పదవుల నుంచి బయటకు రాలేం కదా' అని కేంద్ర క్యాబినెట్ లో కొనసాగుతున్న టీడీపీ మంత్రులను ఉద్దేశించి అన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజీలోకి వెళుతుందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'చంద్రబాబు పుణ్యాన మహారాష్ట్ర, కర్ణాటక 70 టీఎంసీల నీరు మనకు ఇవ్వకుండా ఆపేస్తే ఏం చేయాలి. ఇటువంటి భయాందోళనర నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు కాపాడుకోవాలా, వదులుకోవాలా' జగన్ అని ప్రశ్నించారు. చంద్రబాబు చీకటిలో చిదంబరాన్ని కలిసినప్పడు మీడియా ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చిదంబరం కూడా ఆ విషయాన్ని పార్లమెంట్ లోనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు.