'నమ్మకం, విశ్వసనీయతే నా ఆస్తి'
చింత అరుగు రోడ్ షోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నంద్యాల: ధర్మానికి తోడుగా, అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నంద్యాల ప్రజలను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభ్యర్థించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ రోజు బుధవారం చింత అరుగులో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వచ్చే వరకు చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులను నంద్యాలలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.
మోసం చేయడం చంద్రబాబు నైజమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పడం తనకు చేతకాదని, విశ్వసనీయతే తనకున్న ఆస్తి అని జగన్ పేర్కొన్నారు. ధర్మాన్ని బతికించాలని, వైఎస్సార్ సీపీని గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
-
మనం వేసే ఓటు ఎవరినో ఎమ్మెల్యే చేసేందుకు మాత్రమే కాదు -
చంద్రబాబు మూడున్నరేళ్ల పరిపాలనపై ఓటు వేయబోతున్నాం -
ధర్మానికి తోడుగా నిలబడేందుకు, అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి -
విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావడానికి ఓటు వేయండి -
కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరే సమాధానం చెప్పండి -
ఉప ఎన్నికలకు ముందు నంద్యాల రోడ్డుపై చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులను ఎప్పుడైనా చూశారా? -
చంద్రబాబు మూడేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా? -
వైఎస్ఆర్ పాలనలో నంద్యాలో 21,800 పెన్షన్లు ఉంటే బాబు పాలనలో 15 వేలకు కుదించారు -
చంద్రబాబు పాలనలో రేషన్ బియ్యం తప్ప ఇంకేమీ రావడం లేదు -
నంద్యాలలో కాలనీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు -
బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. జాబు రాకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు -
ఈ 38 నెలల్లో ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.78 వేలు బకాయి పడ్డారు -
ముఖ్యమంత్రి కావడానికి ఎన్ని మాటలు చెప్పారో చూశాం -
ఎన్నికల తర్వాత కర్నూలు సాక్షిగా స్వాతంత్ర్య వేడుకల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు -
కర్నూలుకు ఎయిర్పోర్టు తెస్తామన్నారు, ట్రిఫుల్ ఐటీ పెట్టిస్తామన్నారు -
స్మార్ట్ సిటీ చేస్తామన్నారు, ఉర్దూ యూనివర్సిటీ, మైనింగ్ స్కూల్ తెస్తామన్నారు -
అవుకు వద్ద ఇండస్ట్రియల్ పార్క్.. ఆదోని, ఎమ్మిగనూరులో అపెరల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు -
సీఎం హోదాలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు -
నంద్యాల ఉప ఎన్నిక వచ్చేసరికి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు -
చంద్రబాబు తనదగ్గరున్న పోలీసు బలంతో ఓటు అడుగుతున్నారు -
డబ్బులతో ఎవరినైనా కొనేయగలననే అహకారం చంద్రబాబుకు పెరిగిపోయింది -
లంచాలతో పోగేసిన డబ్బుతో ఓట్లు అడుగుతున్నారు -
నా దగ్గర చంద్రబాబులా డబ్బులు లేవు -
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపే చానళ్లు, పేపర్లు లేవు -
నాకున్నదల్లా దివంగత మహానేత ఇచ్చిన పెద్ద కుటుంబమే నా ఆస్తి -
జగన్ అబద్దం చెప్పడు, మోసం చేయడు.. వాళ్ల నాన్న మాదిరే మాటపై నిలబడతాడన్న నమ్మకం, విశ్వసనీయతే నా ఆస్తి -
దేవుడి దయ, మీ ఆశీస్సులు కావాలి -
ధర్మాన్ని బతికించండి, వైఎస్సార్ సీపీని గెలిపించండి