విశాఖ నేతలతో ముగిసిన వైఎస్ జగన్ సమీక్ష
హైదరాబాద్: విశాఖపట్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది కపట ప్రేమ అని ఆ జిల్లా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి.... గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన ఆ జిల్లా నేతలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం గుడివాడ అమర్నాథ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ... చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల నేపథ్యంలో టీడీపీ హామీలు తదితర అన్ని అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
హుదూద్ బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదన్నారు. హుదూద్ బాధితుల అంశాన్ని కూడా ఈ సందర్భంగా సమీక్షలో చర్చించినట్లు చెప్పారు. త్వరలో జరగనున్న గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని.. నగర మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించామన్నారు.వచ్చేనెల 5వ తేదీన విశాఖలో జరిగే మహాధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.