70 శాతం ఇళ్లు ఇంకా చీకట్లోనే

70 శాతం ఇళ్లు ఇంకా చీకట్లోనే - Sakshi


జగన్ పర్యటనలో కనిపించిన దృశ్యాలు

ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసిన విపక్ష నేత

 


విశాఖపట్నం: తుపాను దెబ్బకు కరెంటు పోయి 70 శాతం ఇళ్లు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. అతలాకుతలమైన సమాచార వ్యవస్థింకా గాడినపడలేదు. కూకటివేళ్లతో సహా కూలిపోయిన చెట్లు ఇప్పటికీ అలా రోడ్లమీదే ఉన్నాయి. గూడు చెదిరిన నిరుపేదలు ఆకలిదప్పులు తీరక పడిగాపులు పడుతున్నా రు. సర్కారు సాయం కోసం ఎదురుచూస్తూ... తమ వద్దకు ఇప్పటికీ ఏ ఒక్కరూ రాలేదని శాపనార్థాలు పెడుతున్నారు. గడిచిన తొమ్మిది రోజులుగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించినపుడు ఎదురుపడిన దృశ్యాలివి. బాధితులు నేరుగా ఆయన వద్దకు వచ్చి తమకిప్పటికీ ఒక్క కిలో బియ్యం కూడా అందలేదని, తమను పలకరించినవారే లేకపోయారని వాపోయినపుడు ఆయన చలించిపోయారు. సర్కారు మెడలు వంచి సహాయం అందేలా చేస్తామని వారికి భరోసానిచ్చారు. 10 రూపాయల పులిహోర ప్యాకెట్టు ఇచ్చేసి చేతులు దులుపుకుందంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. తినేందుకు వీల్లేని పాచిపదార్థాలు పంచటాన్ని వేలెత్తిచూపారు. రూ.1 కిలోబియ్యం 25 కేజీలు ఇచ్చి... అంటే కేవలం పాతిక రూపాయలు విదిలించి సహాయం చేసేశామని చెప్పుకుంటున్న ప్రభు త్వ పబ్లిసిటీ స్టంట్‌ను ఎండగట్టారు.



ప్రతి బాధి త కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5వేలు ఇవ్వాలని, పాడైపోయిన ఇళ్ల మరమ్మతులకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు బదులుగా తుపాన్లను తట్టుకునే సామర్థ్యంతో కొత్త ఇళ్లు కట్టిం చాలని డిమాండ్ చేశారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ తొమ్మిది రోజుల పర్యటన అలుపెరుగకుండా, విరామంలేకుండా సాగింది. రోజులో దాదాపు 12 గంటలు తుపాను బాధితుల కష్టాలు విని భరోసానివ్వడంలోనే గడిపారు. తుపానుతీరం దాటిన పూడిమడక గ్రామానికి వెళ్లిన తొలినేత జగనే. అధికారులు, అధికార పార్టీ నేతలు సమీక్షలు, మీడియా సమావేశంలోనే కాలం గడపగా జగన్ కాలినడకన పర్యటించి ఇంటింటికీ వెళ్లి బాధితుల కష్టాలు ఆలకిం చారు.   పిషింగ్‌హార్బర్, జలారిపేటలలో పర్యటించి మత్స్యకారుల కష్టాలను తెలుసుకున్నారు. తీరప్రాంత కాలనీల్లో కాలినడకన తిరిగి వేలాదిమంది మత్స్యకారులకు ధైర్యం చెప్పారు.



ప్రాణాలతో బాబు పబ్లిసిటీ స్టంట్: జగన్

 

 మనిషి ప్రాణాన్ని కూడా చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌గా మార్చి బాధితులకు తీరని అన్యాయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. పబ్లిసిటీ ఉంటుందనుకున్న చోట రూ.5 లక్షలు పరిహారమిచ్చి, లేదనుకున్న చోట రూ.3 లక్షలు మాత్రమే ఇస్తూ కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రం పేలుడులో మృతుల కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. - సాక్షి, కాకినాడ





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top