చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ - Sakshi


అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయంగా భావిస్తే, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని,  ఆ ఎన్నికల ఫలితాలను తాము రెఫరెండంగా స్వీకరిస్తామని, ఇందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.



స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఇచ్చి కొనుగోలు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రలోభపెట్టి గెలిచారని, చంద్రబాబు దీన్ని తమ ఘనతగా తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలా అక్రమ మార్గాల్లో గెలవడం ప్రజల అభిప్రాయమా? ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లోకి ఏ సందేశం పంపుతారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పాలన బాగుందని భావిస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారని, ఇప్పుడేమో నీతులు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. బడ్జెట్‌లో కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదని, చంద్రబాబు ప్రతి విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top