చాలా గ్రామాల్లో నష్టాన్ని అంచనా వేయలేదు:జగన్

చాలా గ్రామాల్లో నష్టాన్ని అంచనా వేయలేదు:జగన్ - Sakshi


విజయనగరం: హుదూద్ తుపాను ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయినా అక్కడి పరిస్థితులను అధికారులు సరిగా అంచనా వేయలేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చాలా గ్రామాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు రాలేదన్న సంగతిని బాధితులు తన దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు. సోమవారం బోగాపురం మండలం దిబ్బలపాలెంలో పర్యటించిన జగన్.. నవంబర్ 5 లోగా  తుపానుతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఒకవేళ అలాకాకుంటే డ్వాక్రా, రైతు రుణమాఫీ దీక్షలతో పాటు ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫైబర్ బోట్లు కోల్పోయిన మత్య్యకారులకు రూ. 2.50 లక్షలు నష్ట పరిహారంతో పాటు, వలలు కోల్పోయిన మత్య్సకారులకు రూ.50 వేలు ఇవ్వాలన్నారు. కొబ్బరి తోటలు కోల్పోయిన వారికి చెట్టుకు రూ. 5 వేలు ఇవ్వాలన్నారు.


 


జీడి మామిడి తోటలకు ఎకరాలు రూ. 50 వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం పేరుతో ఎప్పుడూ ఇచ్చే రూ.25కు 25 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇవ్వడాన్ని జగన్ తప్పుబట్టారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఒక్క అధికారి రాలేదని బాధితులు స్పష్టం చేశారని జగన్ అన్నారు. ఒకవేళ వచ్చినా వారికి నచ్చిన వారి పేర్లు రాసుకుని వెళ్లిపోవడం ఎంత వరకూ సమంజసం అన్నారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు ఇవ్వాలని జగన్ తెలిపారు.పూర్తిగా పాడైన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించాలని జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top