వైఎస్ జగన్ రైతు దీక్ష విరమణ
తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రెండు రోజుల దీక్ష ముగిసింది. నిమ్మరసం తీసుకొని ఈ సాయంత్రం 4 గంటలకు ఆయన దీక్ష విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం పెడితే రైతుల రుణాలు అన్నీ మాఫీ అయ్యాయని గుర్తు చేశారు. ఆ మహానేత చర్యతో తొలి సంతకం పెడితే అదో శాసనంలాగా అమలవుతుందన్న నమ్మకం ఉండేదన్నారు.
వైఎస్ జగన్మోహన రెడ్డి మాటల్లో...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ పెద్ద అబద్దం. పంచపాండవులు మంచంకోళ్లు అన్నట్లు ఉంది బాబు రుణమాఫీ వ్యవహారం. చంద్రబాబు ఎంతమంది డ్వాక్రా మహిళల, రైతుల రుణాలు మాఫీ చేశారు?. ఒక అబద్దాన్ని తప్పించుకునేందుకు ఆయన ప్రతి రోజూ ఒక అబద్ద చెబుతూ పోతున్నారు. రైతుల రుణాలు మాఫీ కాకపోవడంతో 14 శాతం వడ్డీ కడుతున్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కొత్త రుణాలు రావడంలేదు. ఉత్పత్తులు అమ్ముకునే పరిస్థితిలేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదు. ఎరువులు అందడంలేదు. ఎరువులు బ్లాకులో కొనవలసి వస్తోంది. కరువు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడే పరిస్థితిలేదు. రైతులు రెండు రూపాయలు, మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకొని వ్యవసాయం చేయవలసి పరిస్థితి ఏర్పడింది. రైతుల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. ఈ విషయమై చంద్రబాబు నోట్లో నుంచి ఒక్క మాట రావడంలేదు. ఆత్మహత్యలపై మాట్లాడటంలేదు. మాట్లాడితే ఎక్స్గ్రేషియా ఇవ్వవలసి వస్తుందని మాట్లాడటంలేదు.