బస్సులో నుంచి జారిపడి యువకుడి మృతి
నర్సన్నపేట (శ్రీకాకుళం) : ఆస్పత్రికి వెళ్లి వస్తున్న యువకుడు ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం కోమర్తి గ్రామ సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం... మండలంలోని తిలారు గ్రామానికి చెందిన మంత్రి బాబ్జి(22) ఆరోగ్యం బాలేకపోవడంతో తండ్రితో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్నాడు. శ్రీకాకుళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీకాకుళం నుంచి శ్రీముఖలింగం వెళ్తుండగా తండ్రితోపాటు బస్సు ఎక్కాడు.
ఈ క్రమంలో బస్సు కోమర్తి దగ్గరకు రాగానే బాబ్జి ముందు డోరు నుంచి జారిపడిపోయాడు. దీంతో బస్సు వెనక చక్రాలు అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతునికి ఫిట్స్ ఉన్నాయని, అందుకే ఒక్కసారిగా బస్సులో నుంచి కింద పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.