పోలీసులపై యువకుల దాడి
- నలుగురు యువకుల అరెస్టు
- ఒకరు ఎయిర్ ఫోర్సు ఉద్యోగి
విశాఖపట్నం: రాత్రి గస్తీకి వెళ్లిన పోలీసులపై మింది గ్రామానికి చెందిన నలుగురు యువకులు దాడి చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక క్రైమ్ విభాగం కానిస్టేబుల్ మురళి, హోంగార్డు ముత్యాలనాయుడు, డ్రైవర్ శ్రీనుతో కలిసి రాత్రి గస్తీలో భాగంగా మింది గ్రామానికి వెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో గ్రామానికి చెందిన సిగడాపు చిరంజీవి, యంపల నరేష్, కోన కార్తీక్, దారపురెడ్డి మధు వీరికి తారసపడ్డంతో వారిని ప్రశ్నించారు. ఆ సమయంలో యువకులు మద్యం తాగి ఉన్నట్టు వారు గుర్తించారు.
వారికి తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి తెగబడ్డారు. దాడిలో కానిస్టేబుల్ మురళికి గాయాలవ్వగా, హోంగార్డుకు, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ యువకులను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. దాడిచేసిన వారిలో సిగడాపు చిరంజీవి ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు లా అండ్ ఆర్డర్ ఎస్ఐ దాలిబాబు దర్యాప్తు చేస్తున్నారు.