రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గుర్ల(చీపురుపల్లి): మండలంలోని లవిడాం గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్తి వెంకటేష్(28) మృతి చెందినట్లు ఎస్ఐ సంభాన రవి తెలిపారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే... మెరకముడిదాం మండలం చెల్లాపురం గ్రామానికి చెందిన అల్తి వెంకటేష్, అల్తి సన్యాసినాయుడు టీవీయస్ ఎక్స్ల్(మొపెడ్) బండిపై విజయనగరం ఒక శుభకార్యానికి బయలుదేరారు. మార్గం మధ్యలో లవిడాం గ్రామం వద్ద గరివిడి నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఆటోను తప్పించబోయి టీవీయస్ ఎక్స్ల్(మొపెడ్)ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో అల్తి వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. అల్తి సన్యాసి యుడు తీవ్రంగా గాయపడడంతో విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్తి వెంకటేష్ బీటెక్ చదివి ఇటీవల మెరైన్ ఇంజినీర్ ఉద్యోగం సంపాదించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఉద్యోగంలో చేరి ఇటీవల సెలవుపై వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుర్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.