ప్రేమించిన యువతి దక్కలేదని యువకుడి బలవన్మరణం


టెక్కలి:  ప్రేమించిన యువతికి వివాహం జరిగిపోయిందనే విషయం తెలుసుకున్న ఆ యువకుడు భరించలేకపోయాడు.  చావే చరణ్యమని భావించాడు. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ పోస్టల్ ఉద్యోగి. టెక్కలి మండలం నౌపడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటనపై పలాస జీఆర్‌పీ సిబ్బంది కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన జన్ని పొట్టయ్య (23)  సంతబొమ్మాళి మండలం నౌపడ పోస్టల్ కార్యాలయంలో మెయిల్ క్యారియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన కొంత కాలంగా సొంత గ్రామానికి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.


అయితే ఆమెకు ఇటీవల పెళ్లై పోవడంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం రాత్రి నౌపడ రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్టు జీఆర్‌పీ హెచ్‌సీ సత్యనారాయణ గురువారం తెలిపారు. కాగా మృతదేహాన్ని పరిశీలించిన పోస్టల్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొట్టయ్య బుధవారం విధులు నిర్వహిస్తున్న సమయంలో చాలా ఫోన్ కాల్స్ రావడంతో హడావుడిగా స్వగ్రామానికి వెళ్లే సమయంలో ఎవరైనా దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top