కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా
గుంటూరు: ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీలో ఏళ్ల తరబడి పనిచేసిన కార్మికులకు జేపీ యాజమాన్యం అన్యాయం చేస్తోందని, తక్షణమే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొండారెడ్డి డిమాండ్ చేశారు. వివరాలు...దాచేపల్లి మండలంలోని గామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ మొయిన్గేట్ వద్ద ప్రగతిశీల కార్మిక సమైక్య ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. ఈ ధర్నా సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రాసిమెంట్ ఫ్యాక్టరీని జేపీ యజమాన్యం కొనుగోలు చేసిన తరువాత ఫ్యాక్టరీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మెకానికల్, లోడింగ్, ఆన్లోడింగ్, సివిల్ కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
అధికార పార్టీ నాయకుల తీరుతోనే కార్మికులను యజమాన్యం విధుల్లోకి తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. కార్మికుల తరఫున అధికార పార్టీ నాయకులు యజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ ధర్నాలో సమైక్య జిల్లా అధ్యక్షులు ముచ్చు లూకయ్య, చిప్స్అండ్ ఫల్వరైజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జీ.వేదమణి, ఎమ్మార్పీఎస్ గురజాల నియోజకవర్గ అధ్యక్షులు మంగళపల్లి సాల్మాన్రాజు, సమైక్య నాయకులు నల్లా నాగార్జున, చల్లా ప్రభాకర్, కార్మికులు పాల్గొన్నారు.
(దాచేపల్లి)