మహిళా న్యాయవాది దుర్మరణం
అనంతగిరి : విశాఖకు చెందిన మహిళా న్యాయవాది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా మరో న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు, గాయపడిన న్యాయవాది తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం అరకు నుంచి విశాఖపట్నం కారులో వస్తుండగా విశాఖ జిల్లా అనంతగిరి మండలం, కాశీపట్నం కొత్తమ్మగుడి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న న్యాయవాది డి. సురేష్కుమార్ తీవ్రంగా గాయపడగా మహిళా న్యాయవాది ఎ. రత్నం (28) మృతి చెందారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానిక గిరిజనులు తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరినీ ఎస్.కోటలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి ఆటోలో తరలించారు. మహిళా న్యాయవాది అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించి..గాయపడిన న్యాయవాది సురేష్కుమార్కు ప్రథమ చికిత్స అందజేశారు. ఎస్. కోట పోలీసులు క్షతగాత్రుని వద్ద నుంచి స్టేట్మెంట్ నమోదు చేసుకుని అనంతగిరి పోలీసులకు కేసును రిఫర్ చేయడంతో పాటు మహిళా న్యాయవాది మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.