మహిళల ఆలోచన మారాలి
తణుకు టౌన్ : మహిళల ఆలోచనాధోరణిలో మార్పుతో లింగ వివక్షతను నిర్మూలించవచ్చని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పి.లక్ష్మీశారద అన్నారు. మంగ ళవారం తణుకులోని ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో డీఆర్సీ ఆధ్వర్యంలో లింగవిక్షత అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అరుణ అధ్యక్షత వహించారు. లక్ష్మీశారద మాట్లాడుతూ బాల్య వివాహాలు నేరం అని చట్టం చెబుతున్నా గ్రామాలలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.
బాల్య వివాహాల నిరోధం కోసం అంగన్వాడీ కార్యకర్త మొదలుకుని పోలీసు ఉన్నతాధికారుల వరకు ఏ అధికారికైనా ఫిర్యాదు చేయవచ్చని తెలి పారు. వరకట్న నిర్మూలనకు చట్టాలున్నా ఆచరణలో మాత్రం కట్నం తీసుకోవడం, ఇవ్వడం తగ్గలేదన్నారు. మహిళలపై వివక్షత గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతోందని, ఆడశిశువులను పిండ దశలోనే తొలగించే యంత్రాలు, పరీక్షలు రావడంతో వివక్ష మరీ ఎక్కువైందన్నారు. దీని నివారణకు పీసీపీఎన్డీటీ చట్టం తీసుకోవడం రావడం జరిగిందన్నారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ మానసికంగా పరిణితి చెందనిదే సమాజంలో వివక్షత తగ్గదని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని కోరారు.
స్త్రీవాద రచయిత్రి కుప్పి పద్మ, జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) చైర్మన్ డాక్టర్ ఎం.శ్రీనివాసప్రసాద్, కళాశాల కోశాధికారి నందిగం సుదాకర్, వర్క్షాప్ కన్వీనర్ డాక్టర్ ఎం.ఝాన్సీ, కళాశాల మహిళా సాధికారిత చైర్మన్ కె.వాణీ, ఏయూ లా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్లవి, సెయింట్ థెరిస్సా కళాశాల అద్యాపకురాలు కేవీ పద్మావతి, డాక్టర్ రాధాపుష్పావతి, డాక్టర్ బి.నాగపద్మావతి, ప్రిన్సిపాల్ డి.విజయలక్ష్మి, వీవీవీ సత్యనారాయణరెడ్డి, వివిద కళాశాలల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
క్రమశిక్షణ అవసరం
స్వేచ్ఛగా ఉండాలనుకునే వారికి క్రమశిక్షణ అవసరం. స్త్రీలను ఎవరు అవ మానించినట్లు మాట్లాడినా నిరసన తెలియజేయాలి. మంచి సాహిత్యం ద్వారానే మంచి వ్యక్తులు తయారవుతారు.
- కుప్పిలి పద్మ,
స్త్రీవాద రచయిత్రి
మహిళా ప్రాతినిథ్యం పెరగాలి
చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. ప్రభుత్వం నిర్దేశించిన 33 శాతం కూడా మహిళా సభ్యులు కూడా చట్ట సభలలో లేరు. పురుషులతో సమానంగా హక్కులు ఉన్నా సరైన అవగాహన లేదు.
- డాక్టర్ పీ అరుణ, ప్రిన్సిపాల్ ఎస్కెఎస్డీ మహిళా కళాశాల తణుకు.
చట్టాలున్నా కొన్నే అమలు
మహిళా అభ్యుదయానికి చట్టాలు ఉన్నా ఆచరణలో కొన్నే మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయి. విద్య, రాజకీయాలు, ఇతర రంగాలలో మహిళలు వెనుకబడి ఉన్నారు. ఇది లింగవివక్షతను తెలియజేస్తుంది.
- డాక్టర్ ఎం ఝాన్సీ,
వర్క్షాపు కన్వీనర్, తణుకు
సృష్టిలోనేవివక్ష
సృష్టిలో ఏజాతిలో లేని వివక్షత ఒక్క మానవ జాతిలోనే ఉంది. అయితే ఒక తరానికి మరో తరానికి మధ్య ఆలోచనల్లో కొంత సరళత వస్తుంది. ఇది లింగవివక్షత తగ్గడానికి దోహదం చేస్తుందని ఆశిద్దాం.
- డాక్టర్ ఎం శ్రీనివాసప్రసాద్, జిల్లా వనరుల కేంద్ర చైర్మన్, తణుకు