మూడు నెలల బాలుడి విక్రయం


నాయుడుపేట (నెల్లూరు జిల్లా) : రెండు రోజుల క్రితం విక్రయించబడిన మూడు నెలల బాలుడిని ఐసీడీఎస్ సీపీడీవో, జిల్లా శిశు సంరక్షణ అధికారులు మంగళవారం గుర్తించారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోరుమంచివారికండ్రిగ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీతలపూడి బాబయ్య, క్రిష్ణమ్మ దంపతులు సంతానం లేకపోవడంతో రెండు రోజుల క్రితం ఒక బాలుడిని తీసుకొని వచ్చారు. కాగా ఈ విషయం తెలిసిన అధికారులు దంపతులను వివరణ కోరగా నాయుడుపేట మండల కేంద్రానికి చెందిన బూబమ్మ అనే మహిళ దగ్గర నుంచి తీసుకొని వచ్చామని తెలిపారు.



దీంతో అధికారులు పోలీసుల సహాయంతో విచారణ కోసం బూబమ్మ ఇంటికి వెళ్లగా ఆమె పరారైనట్లు పోలీసులు తెలిపారు. బూబమ్మ ఎవరి దగ్గర నుంచి బాలుడిని తీసుకొచ్చి విక్రయించిందో తెలియాల్సి ఉంది. అయితే పిల్లలు లేని ఆ దంపతులు బూబమ్మ దగ్గర నుంచి బాలుడిని రూ. 70వేలకు కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు బూబమ్మ కోసం గాలిస్తున్నారు. కాగా బాలుడిని నెల్లూరులోని శిశు విహార్‌కు తరలించనున్నట్లు శిశు సంరక్షణ అధికారులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top