బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు


తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా,  బైక్‌పై ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాత గుంటూరుకు చెందిన కొచ్చర్లపాటి గిరిధర్ వర్మకు కేఎల్ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పాత గుంటూరు నుంచి గిరిధర్ వర్మ, అతడి తల్లి విఘ్నేశ్వరి, మేనమామ భాస్కర్‌వర్మ బైక్‌పై వడ్డేశ్వరం బయల్దేరారు. భాస్కర్ వర్మ బండి నడుపుతుండగా.. మధ్యలో గిరిధర్‌ వర్మ, వెనుక విఘ్నేశ్వరి కూర్చున్నారు. మరో 5 నిమిషాల్లో యూనివర్సిటీకి చేరుకుంటామనగా... వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విఘ్నేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, భాస్కర్, గిరిధర్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top