ప్రియుడి సాయంతో కొడుకును చంపింది


తమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో కన్న కొడుకునే చంపిందో తల్లి. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నంబులపూల కుంట మండలం వడ్డిపల్లెకు చెందిన ప్రభాకర్‌, ఇదే గ్రామానికి చెందిన గంగులమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.



కుమారుడు వంశి(14) నల్లచెరువులోని మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ దంపతులు నాలుగేళ్ల క్రితం విడిపోయారు. ఇద్దరు పిల్లలు తండ్రివద్దే వడ్డిపల్లెలో ఉంటున్నారు. గంగులమ్మ అనంతపురానికి చెందిన రవి నాయక్‌తో సంబంధం కొనసాగిస్తోంది. అయితే మరి కొందరితో కూడా తిరుగు తుండడంతో కొడుకు తల్లిని ప్రశ్నించాడు.


తండ్రివద్దే ఉండాలని కోరాడు. దాంతో కక్ష పెంచుకున్న గంగులమ్మ కొడుకును కడతేర్చాలని నిర్ణయించుకుంది. గత నెల 27వ తేదీ ప్రియుడితో కలిసి నల్లచెరువులోని స్కూలుకు వెళ్లి మాయమాటలు చెప్పి వంశిని పిలుచుకు వచ్చింది. కదిరి సమీపంలోని ఎర్రదొడ్డి గంగమ్మ గుడి పక్కకు తీసుకెళ్లి రవి నాయక్ సహకారంతో గొంతునులిమి చంపేసి.. పక్కనున్న కాలువలో పడేసింది.



కుమారుడు కనిపించక పోయేసరికి ప్రభాకర్ ఈనెల 2వ తేదీ నల్లచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు, గంగులమ్మ ప్రవర్తనపై అనుమానంతో ఆమె సెల్‌ఫోన్ కాల్స్‌పై నిగా ఉంచారు. వాటి ఆధారంగా సోమవారం గంగులమ్మను, రవి నాయక్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా ఇద్దరూ నేరం అంగీకరించారు. తామే చంపి కాలువలో పడేశామని తెలిపారు. పోలీసులు ఎర్రదొడ్డి కాలువలో గాలించగా వంశి మృతదేహం దొరికింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top