ఉపాధ్యాయులతో పెట్టుకుంటే నూకలు చెల్లుతాయ్
కలెక్టరేట్ వద్ద జీవో పత్రాలను దగ్ధం చేసిన ఎస్టీయూ
కడప ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాలకు నూకలు చెల్లినట్లేనని, కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచిన ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్థి చెబుతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు లెక్కల జమాల్రెడ్డి, జిల్లా అధ్యక్షులు జయరామయ్య హెచ్చరించారు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు అక్రమ బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సంబంధిత జీవో కాపీలను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనుకూలమని, నీతి, నిజాయితీ, పారదర్శకత గల వారమని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ విధానానికి స్వస్తి చెప్పి 317 మంది ఉపాధ్యాయులను డొడ్డిదారిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు.
లక్షలాది రుపాయలు ముడుపులు తీసుకుందని ప్రభుత్వంపై ఆరోపించారు. పలుకుబడి, డబ్బులున్నవారికే ఈ ప్రభుత్వం వత్తాసు పలకడం చూస్తే, ఇది కార్పొరేట్ ప్రభుత్వంలా ఉందన్నారు. సంబంధిత జీవోను ఉపసంహరించుకోకపేతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఎస్టీయూ హెచ్చరించింది.