అన్ని వేళలా అందుబాటులో ఉంటా


సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

 తోటపల్లిగూడూరు : నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అర్ధరాత్రయినా స్పందిస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్రాను. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఓ సేవకునిలా పని చేస్తానన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకాణి మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు. నియోజకవర్గ ప్రజలు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రయినా సరే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందిస్తానని, సమస్య ఉన్న ఎవరైనా తన సహాయం కోరవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పని చేస్తానన్నారు.

 

 ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని ఇక రాజకీయాలు అవసరం లేదని, అధికారులు, ఇతర పార్టీ నేతల సూచనలు, సలహాలు ఇస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మండల పరిషత్ నిధులు, ఎమ్యెల్యే నిధులు, జిల్లా పరిషత్ నిధులతో నియోజక అభివృద్ధికి పాడుపడతానన్నారు. నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటువుతున్న పరిశ్రమల యాజమాన్యాల సహకారంతో ప్రగతి బాట పట్టిస్తానని కాకాణి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్వోగులు కూడా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గాని అభివృద్ధిలో గాని అధికారులకు ఎలాంటి ఒత్తిడిలు ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

 

 సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన చేయొద్దన్నారు. పలుశాఖల అధికారులను సుతిమెత్తగా మందలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టిగా పని చేస్తేనే అభివృద్ధి నల్లేరుమీద నడకలా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రవిచంద్రప్రసాద్, తహశీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సావిత్రమ్మ, జెడ్పీటీసీ సభ్యులు మన్నెం చిరంజీవిగౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షరాలు చెరుకూరు సరళకుమారి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top