భర్తను హత్యచేసి ప్రియుడితో పరార్!
(అనీల్ కుమార్)
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో ఓ యువతి తన ప్రియుడితో కలసి భర్తను హత్య చేసింది. ఆ తరువాత ఇద్దరూ కలసి పారిపోయారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం అడవిరాములపాడు గ్రామానికి మర్లపూడి ఆశీర్వాదం(30)కు, చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన ప్రమీలతో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి మహేశ్వరి, సిరివల్లి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆశీర్వాదం తాపీమేస్త్రీగా పని చేస్తారు. ప్రమీల వేల్పుల వినోద్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
వినోద్, ప్రమీల కలసి సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆశీర్వాదం మర్మాంగాలు కోసి హత్య చేశారు. ఆ తరువాత వారు ఇద్దరూ పారిపోయారు. అయితే ఈ హత్య విషయం పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.