బాబు నామినేషన్ ఎవరేస్తే ఏంటి?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబుకు నామినేషన్ వేసే తీరిక కూడా లేదు. టీడీపీలోకి ఎవరొస్తారా...! అంటూ ఎదురు చూసేందుకే కాలం కాస్త సరిపోయింది. అందుకేనేమో 15 సంవత్సరాలుగా (అంటే మూడు దఫాలుగా) చంద్రబాబు తన నామినేషన్ను వేరే వారిచేత వేయిస్తున్నారు. నామినేషన్ వేసేందుకు వస్తే అదో ఖర్చు. జనం రాకపోతే ఆ ప్రభావం ఓటర్లపై పడుతుంది. దీంతో తాను అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోతే పరిస్థితి ఏమిటని బాబును ప్రతిసారి ఎన్నికల సమయంలో తన మనస్సు ప్రశ్నిస్తోంది. అందుకేనేమో ఈ సారి కూడా నామినేషన్ వేసేందుకు రాలేదు.
తన కుమారుడు లోకేష్ను పంపించి గురువారం నామినేషన్ దాఖలు చేయించారు. 1989లో చంద్రబాబు ఎన్టీ రామారావు టీడీపీ అధినేతగా ఉండగా కుప్పంలో నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఆ తరువాత 1994లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం 1995లో చోటు చేసుకున్న పరిణామాల్లో మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఏకంగా ముఖ్యమంత్రి సీటును ఆక్రమించారు.
అప్పటి నుంచి కుప్పం వైపు చూడలేదు. ఎవరో ఒకరు ఎన్నికల సమయంలో రావడం, నామినేషన్ వేయడంతో ఆయన సరిపెడుతున్నారు. ఈ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఎన్నోసార్లు జగన్మోహన్రెడ్డి సభలు, సమావేశాలు, ఆందోళనలు, ప్రజా పోరాటాలు నిర్వహించడంతో ఆయనపై జనం అభిమానం పెంచుకున్నారు. పైగా 30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమిటని ఓటర్లు ప్రశ్నించుకుంటే చెప్పుకునేందుకు ఏ ఒక్కటీ కనిపించడం లేదు.
పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రమౌళి వైఎస్ఆర్ సీపీ తరపున ఎన్నికల రంగంలోకి దూకారు. ఆయనను ఒకసారి గెలిపిస్తే ఎలా ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ఏమైనా ఈ సారికి జగన్ను ముఖ్యమంత్రిగా చూడాల్సిందేరా...! ఎవరు చెప్పినా వినొద్దు. నీ వరకు నీవు ఆలోచించుకో. ఓటు వెయ్యి. అంతేకాని ఇలా నామినేషన్ కూడా వేసేందుకు రాని నాయకుడికి ఓటు వేసి నీ పరువు తీసుకోకని పలువురు మాట్లాడుకుంటున్నారు.