చంద్రబాబు ఎప్పుడు పిలిచినా మాట్లాడేందుకు రెడీ
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు తామను ఎప్పుడు పిలిచినా... వెళ్లి ఆయనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లో జేసీ ప్రభాకరరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. చిత్రావతిలోకి నీళ్లు వదలడం ద్వారా పల్లె ప్రజల దాహం తీరిందని ఆయన తెలిపారు. పులివెందులకు 5 టీఎంసీల నీళ్లు అవసరమా అంటూ ప్రశ్నించారు. రెండు జిల్లాల రైతులు కోరితేనే తన సోదరుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అక్కడకు వెళ్లారన్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడం వల్ల రవాణ రంగం కుదైలైపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కోర్టులో న్యాయం జరగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం సింగవరం వద్ద పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామిని బాల సోమవారం గండి కొట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై సమాచారం అందుకుని... జేసీ సోదరులతో ఫోన్లో మాట్లాడారు. మీ చర్యలు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేదిగా ఉందని చంద్రబాబు... జేసీ సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సింగపూర్ నుంచి రాగానే వచ్చి నన్ను కలవాలని బాబు... జేసీ సోదరులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకరరెడ్డిపై విధంగా స్పందించారు.