'ఏపీకి ప్రత్యేక హోదా పరిశీలనలో ఉంది'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. విభజన చట్టాన్ని గౌరవిద్దామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనతో చెప్పినట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వెంకయ్య పోలవరానికి అనుకున్న మేర నిధులు రాని మాట వాస్తవమేనన్నారు. అయినా సరే నిధుల కేటాయింపులు దేశ ఆర్థిక స్థితిన దృష్టిలో పెట్టుకుని జరిగాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కూడా పరిశీలనలో ఉందన్నారు.
తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరగనవి.. 9 నెలల్లో జరగాలంటే విడ్డూరం కాక ఏమిటని ప్రశ్నించారు. సమాధానం చెప్పే నైతికత ఉంది కాబట్టే, ధైర్యంగా మాట్లాడుతున్నానన్నారు. తప్పించుకునే అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ రాజధాని తీరు తెన్నులు తెలిశాక వాటికి కేటాయింపులు ఉంటాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.