'అంతవరకూ మేం గడ్డి తినాలా'
ఉండవల్లి రాజధాని ప్రాంత రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖిలో పలు విషయాలు వెలుగు చూశాయి. ఆయన ముందుకొచ్చి బాధిత కుటుంబాలు తమ గోడును వెల్లబోసుకున్నారు. పార్వతీ అనే ఓ పెద్దావిడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్న మూడెకరాల్లో కూతుర్లకు ఇవ్వంగా మిగిలింది 20 సెంట్లేనని, దానికి ప్రభుత్వం పదో ఇరవై వేలో ఇస్తానంటున్నారని చెప్పారు. తమకు డబ్బులు ముఖ్యం కాదని, అసలు భూమిలేకుండా ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. మేం గడ్డి తినాలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తమ పొలాలు ఇవ్వబోమని, దయచేసి తమను వదిలేస్తే బాగుంటుందన్నారు. ఏవేవో మాటలు చెప్పి ఆగం చేస్తారని, చెప్పినాయన ఎన్నాళ్లు అధికారంలో ఉంటాడో కూడా తెలియదన్నారు. తమ మనవరాళ్ల పెళ్లీల్లు చేసేందుకు భూములు కావాల్సిందేనని చెప్పారు. ఇలా ఎందరో మహిళలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నోటికాడ కూడు లాక్కుంటున్నారని, ప్రాణాలైనా వదులుతాం కానీ సెంటు భూమి కూడా ఇవ్వబోమని వారంతా స్పష్టం చేశారు.