అరెస్టులకు బెదిరిపోం
నలుగురు కాదు.. 4 లక్షలమంది వస్తాం: ముద్రగడ
ఆకివీడు : కాపు ఉద్యమంలో జరిగిన హింసాకాండపై త్వరలోనే అరెస్టులు చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, తాము అరెస్టులకు బెదిరిపోయి పారిపోయే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో(సాక్షి కాదు) వచ్చిన వార్తలు కాపులను కలవరపెట్టేలా ఉన్నాయన్నారు.
కాపు జాతి ఎప్పుడూ బెదిరిపోదని, అరెస్టులకు నలుగురు కాదు, నలభై మంది కాదు, నాలుగు లక్షల మందిని రమ్మన్నా వస్తామన్నారు. కాపులను మరోమారు రోడ్డు ఎక్కించే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కమిషన్కు కాపుల పరిస్థితిని తెలియజేసేందుకు ఫార్మెట్ రూపొందించామన్నారు. జిల్లాల వారీగా పేద కాపులు ఎంత మంది ఉన్నారు అనే అంశంపై సర్వే చేయిస్తున్నామని, గ్రామ, మండల, జిల్లా పరిధిలోని సమాచారాన్ని సేకరించి నివేదికను కమిషన్కు అందజేస్తానని ముద్రగడ చెప్పారు.
సంబంధిత వార్తలు