ప్రతిపక్షంలో ఉన్నాం.. నిలదీస్తాం: వైఎస్ జగన్
బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నామని...ప్రజల సమస్యలపై నిలదీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాలంటే మంగళగిరిలో 2,3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడే రాజధాని నిర్మించుకోవచ్చన్నారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవటం అన్యాయమన్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అన్యాయమని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వ భూమి ఉంటే సింగపూర్ కాకపోతే జపాన్..కాకుంటే అమెరికా లాంటిది కూడా కట్టుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం బుద్ధి ఉన్నవారెవరూ హర్షించరని వైఎస్ జగన్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల జీవితాలతో చెలగాటాలాడుకోవడం సరికాదన్నారు.