వైజాగ్లో జాతీయ ‘విద్యుత్’ సదస్సు
అమరావతి: విద్యుత్ ఆదాపై జాతీయ స్థాయి సదస్సుకు విశాఖపట్టణం వేదికకానుంది. 2018-2019 కాలంలో దేశ వ్యాప్తంగా లక్షా ముప్పైరెండు వేల యూనిట్ల విద్యుత్ ఆదా చేయటానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ నెల 18వ తేదీన జరిగే సదస్సులో నిర్ణయిస్తారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖలోని ఎనర్జీ ఎఫిసియన్సీ బ్యూరో(బీఈఈ) నిర్వహించే ఈ కార్యక్రమంలో 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరవుతారు.
విద్యుత్ సమర్ధవంత వినియోగం ద్వారా ఏటా రూ.53 వేల కోట్ల వరకు ఆదా చేసుకోవచ్చని ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. ఎల్ఈడీ బల్బుల వాడకం, వ్యవసాయ రంగంలో సమర్ద యాజమాన్యం, ఉజాలా, పారిశ్రామిక రంగంలో మెరుగైన పద్ధతుల అమలు, భవన నిర్మాణంలో ప్రమాణాలను పాటించటం, నాణ్యమైన విద్యుత్ పరికరాల వాడకం వంటి వాటి ఫలితంగా విద్యుత్ను ఆదా చేసుకోవచ్చునని తెలిపారు.