రాష్ట్రంలో రాజకీయ అవినీతి మితిమీరింది
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు ఆరోపణ
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో రాజకీయ అవినీతి మితిమీరిపోయిందని బీజేపీ శాసనసభాపక్షనేత పి.విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పరిపాలన చేస్తుండగా, రాష్ట్రంలో అవినీతితో నిండిన పాలన సాగుతోందని విమర్శించారు.
గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాలలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ‘సంకల్ప సిద్ధి–నవ భారత నిర్మాణం’ పేరుతో జరిగిన సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ భూ కుంభకోణంపై బాధితుల నుంచి తనకు మూడు వేల ఫిర్యాదులు అందాయని చెప్పారు. మంత్రి కామినేని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని, మోదీ సారథ్యంలో అవినీతి రహిత పాలనకే తాము మద్దతు ఇస్తామని అన్నారు.