రైతులకు 1,90,26,099 జరిమానా
రూ.1,90,26,099.. అక్షరాలా కోటి తొంభై లక్షల ఇరవై ఆరువేల తొంభై తొమ్మిది రూపాయలు.. అధికారులు రైతులకు విధించిన జరిమానా ఇది. ఆశ్చర్యంగా ఉన్నా విజిలెన్స్ అధికారులు ఈ మేరకు నివేదికలు కూడా తయారు చేశారు. నేడో, రేపో నోటీసులు కూడా జారీ చేయనున్నారు. వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మారిస్తే 10 శాతం స్థలాన్ని పంచాయతీకి అప్పగించాలి. ఆ తర్వాత లేఅవుట్ తీసుకోవాలి. ఇటువంటివి ఏమీ చేయకుండానే వ్యవసాయ భూములను ఇళ్లస్థలాలకు విక్రయించారు.
దీనిపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్ అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు. 54 మంది రైతులు దాదాపు 68 ఎకరాల భూమిని రూ. 20,45,60,680కు విక్రయించినట్లు గ్రహించారు. దీంతో రైతులు రూ.1,90,26,099 జరిమానాగా చెల్లించాలని విజిలెన్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను వదిలి తమకు జరిమానా విధించడం సబబు కాదని వాపోతున్నారు. వ్యాపారులు తమ దగ్గర పొలంగానే కొని, వాళ్లే ప్లాట్లుగా మార్చారని, అలాంటప్పుడు తమకు జరిమానా విధించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.