చెరకు వేయలేం!


గిట్టుబాటు ధర పెంచాలి, బకాయిలు చెల్లించా

షుగర్స్ కమిషనర్‌ను నిలదీసిన రైతులు

కారు ముందు రైతు సంఘం నాయకుల బైఠాయింపు  


 

 చోడవరం: గిట్టుబాటు ధర ఇవ్వాలని, చెరకు బకాయిలు చెల్లించాలని రైతులు రాష్ట్ర సుగర్స్ కమిషనర్ మురళిని నిలిదీశారు. సోమవారం గోవాడ సుగర్ ప్యాక్టరీకి వచ్చిన కమిషనర్‌ను రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ సీజన్ కావడంతో ఫ్యాక్టరీకి చెరకు తీసుకొచ్చిన రైతులు, పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో  వచ్చారు. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది సకాలంలో చెరకు బకాయిలు చెల్లింపులో చాలా  ఆలస్యం జరిగిందని, పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని రైతులు గగ్గోలు పెట్టారు. తమ కష్టాలు చెప్పుకుందామంటే పాలకవర్గం, అధికారులు   పట్టించుకోవడం లేద ని  ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నుకు రూ.3 వేలు గిట్టుబాటు ధర ఈ ఏడాది ఇవ్వాలని, లేదంటే వచ్చే ఏడాది నుంచి చెరకు పంట వేయలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దశలవారీగా పేమెంట్స్ ఇస్తామని యాజమాన్యం చెబుతోందని, అలాకాకుండా అంతా ఒకే సారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. చెరకు ఫ్యాక్టరీలను, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు  ధ్వజమెత్తారు. హుద్‌హుద్ తుఫాన్‌కు ఫ్యాక్టరీ నష్టపోయినా కనీసం ఇన్సూరెన్సు కూడా ఇవ్వలేదన్నారు.  



టన్నుకు మూడు వేలు ఇవ్వాలి

అనంతరం ఎపీ చెరకు రైతు సంఘం నాయకులు మరికొంత మంది రైతులు వచ్చి కమిషనర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.  కమిషనర్ కారు ముందు బైఠాయించి  నిరసన తెలిపారు. అనకాపల్లి సుగర్ ప్యాక్టరీని తెరిపించాలని, టన్నుకు రూ.3 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గోవాడ ఫ్యాక్టరీలో కటింగ్ ఆర్డర్లు సక్రమంగా ఇవ్వడం లేదని, ఫ్యాక్టరీలో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ నివేదిక బహిర్గతం చేయాలని, యంత్రాల కొనుగోలులో అవకతవలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  కమిషనర్ కిందకు దిగి రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. బకాయిలు నెలాఖరులోగా చెల్లిస్తామని, మిగతా విషయాలను ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళతామన్నారు.   అంతకు ముందు  వడ్డాది చెరకు కాటాను, రేవళ్లు ప్రాంతంలో రైతులను కలిసి చెరకు సాగుపై కష్టనష్టాలు అడిగి  తెలుసుకున్నారు.



కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలంటూ కార్మికులు సుగర్స్ కమిషనర్‌ను కోరారు. సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న గోవాడ యాజమాన్యం అదనంగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తోందని గుర్తింపు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు తోట శంకరావు, శరగడం రామునాయుడు కమిషనర్ దృష్టికి తెచ్చారు. కారుణ్య నియామకాలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా పదవీవిరమణ వయస్సును 60ఏళ్లకు పెంచాలని కోరారు.  తమను పర్మినెంట్ చేయాలని, జీతభత్యాలు పెంచాలని ఫ్యాక్టరీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ సెక్యూరిటీ కంట్రోల్ లేబర్  సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు జె.రమణ, టి.గంగరాజు కోరారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top