కాపులుప్పాడని దత్తత తీసుకున్న వెంకయ్య
విశాఖపట్నం: కాపులుప్పాడ గ్రామాన్ని తమ కుటుంబం దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. హుదూద్ తుపాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న కాపులుప్పాడ గ్రామాన్ని పునర్ నిర్మిస్తామని తెలిపారు. అందుకు ఎంత ఖర్చు అయిన వెనకాడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి మాట్లాడారు.
తుపాన్ సహాయక చర్యల కోసం వెంకయ్యనాయుడు తన ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ సీఎండీ తుపాన్ సహాయక చర్యల కోసం విరాళంగా రూ. కోటి చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ సీఎండీని వెంకయ్య నాయుడు కోరారు. అందుకు సీఎండీ సానుకూలంగా స్పందించారు.