'చంద్రబాబుది కళంకిత చరిత్ర'
విజయనగరం(బొబ్బిలి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది కళంకిత చరిత్ర అని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరవరరావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విప్లవ ఉద్యమాలు అణచివేతే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. చైనాతో ఎర్రచందనం అమ్మకాలు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చి ఎర్రచందనం కూలీల అరెస్టులు, ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు. దేశం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండని బిచ్చమెత్తుకోవడనికి మోదీ, చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
రాజధాని భూములతో మంత్రుల వ్యాపారం
రాజధాని భూములతో మంత్రులు బినామీ వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. రాజధాని భూసేకరణ కమిటీకి నియమంచిన శివరామకృష్ణ కమిటీ సూచించిన విధంగా కాకుండా దానికి వ్యతిరేకంగా అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తున్నారనిచెప్పారు. దీనివల్ల కష్ణా, గుంటూరు జిల్లాలు కాలుష్యంలో మునిగిపోతాయన్నారు. అమరావతిని కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టేశారన్నారు. లక్ష ఎకరాల సేకరణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీనికి మంత్రి నారాయణ రింగ్ లీడరుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదన్నారు. ఉస్మానియా యూనివర్సీటీలోని రూ. 7 కోట్ల మెస్ బిల్లులు కట్టకుండా విద్యార్థులను రొడ్డున పడేశారని చెప్పారు.
తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల్లో రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. వరంగల్ జిల్లాలోని రెండు మండలాల్లో ఒక ఏడాదిలతో 792 మంది చనిపోయినట్లు నిజనిర్ధారణ కమిటీ వెల్లడించిందన్నారు. యాంటీ కమర్షియల్ ఫారం, పీపుల్ కల్చరల్ ఫారంల పేరుతో చేస్తున్న పోరాటంలో ప్రతీ ఒక్కరు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విరసం నాయకుడు చలసాని ప్రసాద్, గంటి ప్రసాదం సోదరుడు రమణ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.