వాసుకు కన్నీటి వీడ్కోలు

వాసుకు కన్నీటి వీడ్కోలు - Sakshi

  • అంతిమయాత్రలో పాల్గొన్న వేలాదిమంది

  •  పలువురు నేతల నివాళులు

  •  సమగ్ర దర్యాప్తునకు ఉదయభాను డిమాండ్

  • చందాపురం(నందిగామ రూరల్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీ శైల వాసు అంతిమ యాత్ర బుధవారం సాయంత్రం గ్రామంలో భారీ జనసందోహం నడుమ కొనసాగింది. గ్రామంలోని ఆయన గృహాం వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో వేలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కిలోమీటరుపైగా కొనసాగిన ఈ యాత్రలో అభిమానుల నినాదాలతో మార్మోగింది. గ్రామ సమీపంలోని ఆయన పొలం వరకు ఈ యాత్ర సాగింది. వాసు కుమారుడు రామకృష్ణతో చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నవారంతా కంటతడి పెట్టారు.  ఈ అంతిమ యాత్రలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మొండితోక జగన్‌మోహన్‌రావు, కార్యాలయ ఇన్‌చార్జి అరుణ్‌కుమార్, పలువురు పార్టీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

     

    కుటుంబానికి అండగా ఉంటాం...



    శ్రీశైల వాసు కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోనేరు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

     

    వాసు మృతదేహాన్ని బుధవారం ఆయన సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ మంచి నాయకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబానికి ఎటువంటి అవసరం వచ్చినా పార్టీ అండదండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ శ్రీ శైల వాసు హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. వాసు హత్య వెనుక కుట్ర  ఉందనే అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం  కారణంగానే  ఓ మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెంట పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మొండి తోక జగన్‌మోహనరావు, కోవెలమూడి వెంకటనారాయణ తదితరులు ఉన్నారు.  

     

    నా భర్త చనిపోలేదు...



    బొగ్గవరపు శ్రీ శైలవాసు మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు పడుతున్న వేదన వర్ణనాతీతం. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాసు అనతి కాలంలోనే రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగటంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా నందిగామ ప్రాంత  ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

     

    ఆయన మృతిని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, ఆయన ద్వారా సహాయం పొందినవారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ శైల వాసుకు భార్య లక్ష్మీసుజాత, పిల్లలు విష్ణుప్రియ, రామకృష్ణలు ఉన్నారు. విష్ణుప్రియ ఏడో తరగతి చదువుతుండగా, రామకృష్ణ ఐదో తరగతి చదువుతున్నాడు. తండ్రి మృతదేహం వద్ద వారు విషణ్ణ వదనాలతో ఉండటం చూపరులను ఆవేదనకు గురిచేసింది.

     

    కాగా భర్త మృతి చెందాడన్న వార్త తెలిసినప్పటి నుంచి లక్ష్మీసుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను ఓదార్చేందుకు వచ్చిన పెద్దల ముందు తన భర్త చనిపోలేదంటూ విలపించడం వారిని కంట తడి పెట్టించింది. ఒక దశలో వాసు మృతదేహం వద్దకు వచ్చిన భార్య.. ‘నాడి కొట్టుకుంటుంది ఒక్కసారి పరీక్షించ ండి’ అని డాక్టర్ జగన్‌మోహనరావును కోరుతూ విలపించింది. దీంతో ఆయన ఆమెను ఓదార్చేందుకు యత్నించారు. ఈ ఘటనను చూసి అక్కడ ఉన్నవారు తీవ్ర ఆవేదన చెందారు.

     

    నిందితుల కోసం  పోలీసుల ప్రత్యేక బృందాలు



    నందిగామ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీ శైలవాసు హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నందిగామ డీఎస్పీ రాధేష్ మురళీ బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన తుపాకీకి సంబంధించిన ఒక తూటాను అక్కడే స్వాధీనం చేసుకున్నారు. వాసును కాల్చడానికి రెండు తూటాలు ఉపయోగించినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలిసినట్లు ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు.



    హత్య అనంతరం దుండగులు మోటార్ బైక్‌పై పరారయ్యారు. హనుమంతుపాలెం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై అక్కడ సిద్ధంగా ఉన్న కార్లలో వారు పరారైనట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు చందాపురం గ్రామానికి చెందిన ఉన్నం హనుమంతరావు కాగా, రెండో వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుడు పాషాగా గుర్తించారు. పాషా ఫొటో కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీపావళి పండుగ రోజున మృతుడు వాసు వెంబడి వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో అనుసరించినట్లు తేలిం ది. ఆ సమయంలో నందిగామ మెయిన్ సెంటర్లో సంజీవని ఫార్మసీలో పాషా మందులు కొనుక్కునేందుకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ దుకాణంలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీ లించారు. ఎర్రషర్టు ధరించిన పాషాను గురించి, ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

     

    నిందితుడైన హనుమంతరావు కుటుంబ సభ్యులను తీసుకువచ్చి విచారణ చేసినట్లుగా సమాచారం. కొందరు పెద్దలు రూపొందించిన పథకం ప్రకారం.. హనుమంతరావు కిరాయి హంతకునితో హత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందుతున్నట్లు తెలిసింది. కిరాయి హంతకుడిని తీసుకువచ్చి హత్య చేయించే ఆర్థిక స్తోమత హనుమంతరావుకు లేదని పలువురు పేర్కొంటున్నారు. నిందితులను త్వరిత గతిన పట్టుకోవాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.  

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top