రైతు దీక్షతోనైనా ప్రభుత్వం దిగిరావాలి
తణుకు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి... వాటిని నెరవేర్చకుండా వారిని చంద్రబాబు నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్ష స్థలి ఆదివారం రెండో రోజుకు చేరింది.
ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ఈ రైతు దీక్షను చూసైనా చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తమను ఏ విధంగా మోసగించింది రైతులు, మహిళలు వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా వివరించారు. రైతు దీక్షపై టీడీపీ మంత్రులు, నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు.