'టీడీపీ నేతలు భూములు ఎందుకు ఇవ్వలేదు'

'టీడీపీ నేతలు భూములు ఎందుకు ఇవ్వలేదు' - Sakshi


హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లో టీడీపీ నేతలు స్వచ్ఛందంగా భూములు ఎందుకు ఇవ్వలేదంటూ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి  రాజధాని ప్రాంత రైతులనుంచి ఏపీ ప్రభుత్వం భూములు కోరిన నేపథ్యంలో రైతులనుంచి వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైతులకిచ్చే పరిహారం కింద టీడీపీ నేతలెవరైనాసరే వాళ్ల భూములిస్తారా? అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సోమవారం ఆమె వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు. లాండ్ పూలింగ్ సజావుగా జరిగిందన్నది పచ్చి అబద్ధమని అన్నారు. మీ అబద్ధాలన్నీ రేపు బట్టబయలవుతాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.



వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని ఆమె చెప్పారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావించేందుకే వైఎస్ జగన్ పర్యటించనున్నట్టు తెలిపారు. బ్రేక్ ఇన్ ఏపీ, మేక్ ఇన్ సింగపూర్ చందంగా ఏపీ ప్రభుత్వం పాలన నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. రాజధాని డిజైన్ కూడా సొంతంగా తయారు చేసుకోలేని దుస్థితా మనది? అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వానికి సింగపూర్కు మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు ఏమిటి? అంటూ వాసిరెడ్డి పద్మ ఘాటుగా ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top