అర్బన్ బ్యాంకుపై టీడీపీ కన్ను

అర్బన్ బ్యాంకుపై టీడీపీ కన్ను - Sakshi


పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం నేతలు జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరి కళ్లు సహకార రంగంలో నడుస్తున్న    ఓ బ్యాంకుపై పడడంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ    రాజకీయాలు రేషన్ దుకాణాల నుంచి బ్యాంకు వరకూ వ్యాపించడంపై ప్రజలు, వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

 సాక్షి, గుంటూరు: గుంటూరులో కొన్నేళ్లుగా లాభాల బాటలో నడుస్తున్న అర్బన్ బ్యాంక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సహకార రంగంలో కొనసాగుతున్నా ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో డిపాజిట్లు కలిగి ఉన్న ఈ బ్యాంకు ఇప్పటి వరకు ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో నడుస్తోంది. ఆడిటర్ కొత్తమాసు శ్రీనివాసరావు బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నారు.

 

 రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల కన్ను ఈ బ్యాంక్‌పై పడింది. ఇక నుంచి ఇక్కడి వ్యవహారాలన్నీ తామే చూస్తామని, వెంటనే రాజీనామా చేసి వెళ్లాలని ఆ బ్యాంకు చైర్మన్, సీఈఓలకు టీడీపీ నేతలు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. చైర్మన్, డెరైక్టర్లుగా తమ పార్టీ వ్యక్తులను నియమించుకుంటామంటూ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు వారం రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే,  ఈ బ్యాంకులో ఇద్దరు డెరైక్టర్ల పదవీకాలం ఇటీవల ముగిసింది.ఆ స్థానంలో కొత్త వారిని తిరిగి ఎన్నుకునేందుకు ఈ నెల 30న ఎన్నిక నిర్వహించాల్సి వుంది. ఇది తెలుసుకున్న ఆ టీడీపీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఆ పదవులు తమ వారికే ఇవ్వాలని పట్టుపట్టారు. దీంతో బ్యాంక్ చైర్మన్ తన సామా జిక వర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ద్వారా ఎమ్మెల్యేల వద్దకు ఓ రాజీ ప్రతిపాదన పంపించారు. దీనిలో భాగంగా మరో ఆరు నెలలపాటు ప్రస్తుత చైర్మన్ కొనసాగేలా, డెరైక్టర్లుగా ఆ ఎమ్మెల్యేలు చెప్పిన వ్యక్తులను నియమించేలా ప్రతిపాదించారు. ఇలా రాజీ కుదరడంతో ఇద్దరు డెరైక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 27న ముగిసినట్టు తెలిసింది. సీఈఓ విషయం ఇంకా ఎటూ తేల్చలేదని చెబుతున్నారు.టీడీపీ రాజకీయాలతో మసకబారుతున్న బ్యాంక్ ప్రతిష్ట.

 

 జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు అర్బన్ బ్యాంకు వ్యవహారంలో జోక్యం చేసుకోవడాన్ని జిల్లాకు చెందిన ఓ మంత్రి, అర్బన్ పరిధిలోని ఓ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్న ట్లు సమాచారం.

 

 ఇప్పటి వరకు సుమారు రూ. 280 కోట్ల డిపాజిట్లతో లాభాలతో నడుస్తున్న అర్బన్ బ్యాంక్ ప్రతిష్ట టీడీపీ గ్రూపు రాజకీయాల కారణంగా మసకబారనుందనిబ్యాంక్ సిబ్బంది, డిపాజిట్‌దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 ఈ నేపథ్యంలోనే  ఓ మాజీ మంత్రి తనకు అత్యంత ఆప్తుడైన ప్రస్తుత మంత్రి ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలు బ్యాంక్ వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండేలా చెప్పించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెర లేపిందంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top