పేలని దీపావళి

పేలని దీపావళి - Sakshi

  • భారీగా తగ్గిన బాణసంచా విక్రయాలు

  •  రెండేళ్లుగా రూ. 30 కోట్ల అమ్మకాలు

  •  ఈసారి రూ. 6 కోట్లకే పరిమితం

  •  వ్యాపారుల ఆశలపై ‘హుదూద్’ నీళ్లు

  •  భారీగా మిగిలిన నిల్వలు

  • సాక్షి, విజయవాడ : ఈ ఏడాది జిల్లాలో టపాసులు మోతలు, వినీలాకాశంలో తారాజువ్వల వెలుగులు తక్కువగా కనిపిం చాయి. ప్రతి దీపావళికీ కనిపించే సందడి ఈసారి లేకుండాపోయింది. ఇదే రీతిలో బాణసంచా వ్యాపారం కూడా భారీగా తగ్గింది. హోల్‌సేల్ వ్యాపారుల వద్ద  సరుకు నిల్వలు భారీగా మిగిలిపోయాయి. గత ఏడాది కంటే జిల్లాలో సుమారు 70 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. హుదూద్ తుపాను ప్రభావం ఇక్కడా పడడంతో వ్యాపారులకు లాభాలు రాకపోగా, నిల్వలు కూడా మిగలడంతో నష్టాలు చవిచూశారు.

     

    కోట్లలో పెట్టుబడి.. లక్షల్లో వ్యాపారం




    జిల్లాలో ఈ ఏడాది సుమారు రూ. 6 కోట్ల విలువైన బాణసంచా విక్రయాలు జరిగాయి. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి విక్రయాలు చేసే హోల్‌సేల్ వ్యాపారులు కేవలం ఈ ఏడాది  లక్షల రూపాయల వ్యాపారమే చేయగలిగారు. ప్రధానంగా విజయవాడ రాజధాని అయిన నేపథ్యంలో రియల్ విక్రయాలు భారీగా జరిగాయి. దీంతో అనేకమంది వద్ద డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ పర్యాయం పెద్ద మొత్తంలో విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు భావించారు. దీనికితోడు జిల్లాలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకపోవడంతో వ్యాపారం బాగానే జరుగుతుందని అంతా ఆశించారు.



    కాని వ్యాపారుల అంచనాలు తల్లకిందులయ్యాయి. అటు హోల్‌సేల్ వ్యాపారం, ఇటు రిటైల్ వ్యాపారంలోనూ లాభాలు భారీగా రాకపోగా కొందరికి పెట్టుబడులు వచ్చాయి. మరికొందరి వద్ద సరుకు నిల్వలు మిగిలిపోయాయి. బాణసంచా విక్రయాలపై హుదూద్ తుపాను ప్రభావం బాగా పడింది. దీనికితోడు రుణమాఫీ జరగకపోవడంతో అన్నదాతలు ప్రైవేట్ అప్పులతో పంటలు సాగు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.  గన్నవరం, విజయవాడ నగరంలో హోల్‌సేల్ షాపులు, మిగిలిన ప్రాంతాల్లో తాత్కాలిక లెసైన్స్ షాపులు ఉన్నాయి.



    జిల్లావ్యాప్తంగా సుమారు 700 రిటైల్ షాపులున్నాయి. అన్ని షాపుల్లో కలిపి సగటున రూ. 6 కోట్లకు మించి విక్రయాలు జరగలేదు. అనేక మంది రిటైల్ వ్యాపారులు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, చిలకలూరిపేట, పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో విక్రయాలు చేశారు. దీంతో అధిక శాతం వ్యాపారులు ఇతర జిల్లాల్లో కొనుగోళ్లు చేసి ఇక్కడ రిటైల్ విక్రయాలు నిర్వహించారు. దీంతో జిల్లాలో హోల్‌సేల్ వ్యాపారం రూ.1.5 కోట్ల లోపు జరిగినట్లు అంచనా. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా సాగింది.



    భూముల విలువ కోట్లకు చేరడంతో వందలాది ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిగాయి.  అందరి దగ్గర డబ్బు బాగానే ఉంటడంతో పండుగ బాగుంటుందని హోల్‌సేల్ వ్యాపారులు భారీగా నిల్వలు శివకాశి నుంచి కొనుగోలు చేశారు. ఎక్కువ మంది ప్రజలు బాణసంచాకు ఈ ఏడాది దూరంగా ఉండి దానికి పెట్టే ఖర్చులో కొంత తుపాను బాధితులకు విరాళాలు పంపారని నగరానికి చెందిన హోల్‌సేల్ వ్యాపారి ఒకరు తెలిపారు. రెండేళ్ల కిందటం జిల్లాలో సుమారు రూ. 30 కోట్లకు పైగా విక్రయాలు జరగ్గా ప్రస్తుతం రూ. 6 కోట్లకే పరిమితమైంది.

     

    ఎమ్మార్పీ ప్రభావం..



    ఎమ్మార్పీ ప్రభావం కూడా విక్రయాలు తగ్గడానికి మరో కారణంగా మారింది. ఈ ఏడాది ఎమ్మార్పీ సగం కంటే తక్కువ ఉన్నప్పటికీ డిస్కౌంట్ శాతం భారీగా తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయని  ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. గత ఏడాది వరకు విక్రయించే ధర కంటే ఎమ్మార్పీ తొమ్మిది రెట్లు అధికంగా ముద్రించేవారు. రిటైల్ విక్రయాలకు వచ్చే సరికి ఎమ్మార్పీపై  80 నుంచి 85 శాతం డిస్కౌంట్ ధరకు విక్రయాలు జరిపేవారు.  ఈ ఏడాది శివకాశిలో   తయారీ తగ్గడంతోపాటు అక్కడ వ్యాపారులకు ఇన్‌కంట్యాక్స్ ఇబ్బంది పెరిగింది. ఎమ్మార్పీపై వాణిజ్యపన్ను, ఆదాయ పన్ను చెల్లించాల్సి రావటంతో తొమ్మిది రెట్ల అధిక ధరను తగ్గించి నాలుగు రెట్ల ధరను మాత్రమే ప్రింట్ చేశారు. దీంతో బ్రాండెడ్ బాణసంచాకు 50 నుంచి 55 శాతం, సాధారణ బాణసంచాకు 70 శాతం మాత్రమే ఎమ్మార్పీపై తగ్గించి హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయించారు. దీంతో అనివార్యంగా ధరలు పెరిగినట్లయింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top