'సమాజం ఇలాంటి దాడులను హర్షించదు'
ఒంగోలు/హైదరాబాద్: తమ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీకి చెందిన గూండాలు దాడి చేయడాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు. రోజాపై దాడి అమానుషమని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
రోజాపై దాడి టీడీపీ నిరంకుశతత్వం, అప్రజాస్వామ్యానికి అద్దంపట్టేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సభ్య సమాజం ఇలాంటి దాడులను హర్షించదని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీకి చెందిన గూండాలు దాడి చేసిన సంగతి తెలిసిందే.