ఇద్దరి ఉసురు తీసిన విద్యుదాఘాతం


మార్కాపురం : ఫ్యాక్టరీలో పలకల పని చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణంలోని సాయిబాలాజీ థియేటర్‌ సమీపంలో సోమవారం జరి గింది. వివరాలు.. మండలంలోని వేములకోటకు చెందిన ఎలకపాటి కోటమ్మ (40), పట్టణంలోని కంభం రోడ్డులో నివాసం ఉంటున్న గూడెం శివారెడ్డి(35)లు ఎం.రమణ పలకల ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఫ్యాక్టరీకి వచ్చి కార్మికులు యథావిధిగా పనిచేస్తు న్న సమయంలో విద్యుదాఘాతానికి గురై సంఘటన స్థలంలోనే కోటమ్మ, శివారెడ్డిలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.



ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. విష యం తెలిసిన వెంటనే మార్కాపురం సీఐ బత్తుల శ్రీనివాస్, రూరల్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కోటమ్మకు భర్త ఇమ్మానియేల్‌తో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివారెడ్డికి భార్య సావిత్రితో పాటు కుమా ర్తె గాయత్రి, కుమారుడు నరసింహారెడ్డి ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పలకల ఫ్యాక్టరీకి చేరుకుని మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు.



కుటుంబాన్ని పోషించే వ్యక్తులే చనిపోవడంతో తమకు దిక్కెవరంటూ విలపించారు. చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేయడంతో ఫ్యాక్టరీ యజమాని తన వంతు సాయం అందిస్తానని చెప్పడంతో మృతదేహాలను పోస్టుమార్టానికి స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే సమీపంలో ఉన్న పలకల ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సంఘీభావం ప్రకటించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top