బైక్, టాటా ఏస్ ఢీ: ఇద్దరు మృతి


ధర్మవరం అర్బన్ (అనంతపురం) : వేగంగా వచ్చిన మోటారుసైకిల్ టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఎన్‌ఎస్ గేటు నుంచి ధర్మవరం పట్టణానికి బైకుపై శాంతినగర్‌కు చెందిన నరేంద్రరెడ్డి, శారదానగర్‌కు చెందిన దివాకర్, నాగలూరుకు చెందిన రాజశేఖర్‌రెడ్డిలు వస్తూ ఎరగుంట సమీపంలో ధర్మవరం నుంచి వెళుతున్న టాటాఏస్ వాహనాన్ని వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న నరేంద్రరెడ్డి(20) అక్కడికక్కడే మృతి చెందాడు.



స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం దివాకర్, రాజశేఖర్‌రెడ్డిలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో దివాకర్ మృతి చెందగా రాజశేఖర్‌రెడ్డి పరిస్థితి విషమంగానే ఉంది. కాగా టాటా ఏస్ డ్రైవర్ లోకేష్‌కు సైతం స్వల్పగాయాలయ్యాయి. ఇదిలా ఉండగా నరేంద్రరెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మృతుని తల్లిదండ్రులు నరసారెడ్డి, చంద్రకళలు ఆస్పత్రిలో కుమారుని మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top