ఇద్దరు ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మంత్రులకు ప్రాణాపాయం తప్పింది. మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు.. రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు-ఉప్పలపాడు రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మంత్రులు క్షేమంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డంతా బురదగా ఉండడంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు బురదగా మారాయి.