శ్రీవారి దర్శన ఆన్లైన్ టికెట్ల కోటా పెంపు
సాక్షి,తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన ఆన్లైన్ టికెట్ల కోటాను బుధవారం నుంచి టీటీడీ పెంచింది. రూ. 300 టికెట్ల కోటాను 21వేల నుంచి 26 వేలకు పెంచారు. పెంచిన కోటా ప్రకారం బుధవారం రిజర్వు చేసుకున్న భక్తుడికి 56వ రోజున శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించేలా వేర్వేరు టైం స్లాట్లతో టికెట్లు కేటాయించారు. అలాగే, ఒకరోజు గడువులో అమ్ముడుపోని ఖాళీ టికెట్ల బుకింగ్ చేసుకునే సమయాన్ని రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు పెంచారు.
భక్తుల సౌకర్యం కోసమే టికెట్లు పెంచాం: ఈవో
భక్తులకు సులభతరంగా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆన్లైన్ టికెట్లు పెంచామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. దీనివల్ల నిర్దేశించిన సమయంలోనే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి కనీసం గంటన్నర నుంచి రెండు గంటల్లోపే స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లవచ్చన్నారు.