27నుంచి పద్మావతి పరిణయోత్సవాలు


తిరుమల : తిరుమలలో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమలలోని నారాయణగిరి ఉద్యావనంలో పరిణయోత్సవ వేదికను ముస్తాబు చేశారు.కలియుగ ఆరంభంలో సుమారు ఐదు వేల ఏళ్ల కిందట వైకుంఠాన్ని వీడిన శ్రీనివాసుడికి నారాయణవనాన్ని పరిపాలించిన ఆకాశరాజు తన కుమార్తె పద్మావతిదేవితో కన్యాదానం చేసినట్టు వేంకటాచల మహత్యం చెబుతోంది. అదే శుభలగ్నానికి నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీనివాస, పద్మావతీదేవి పరిణయోత్సవాన్ని టీటీడీ 1992 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.


ఉత్సవాల్లో తొలి రోజు వైశాఖ శుద్ధ నవమి సోమవారం మలయప్పస్వామి గజవాహనం, రెండో రోజు మంగళవారం అశ్వవాహనం, మూడో రోజు బుధవారం గరుడవాహనంపై వేంచేస్తారు. ఈ మూడు రోజులూ శ్రీదేవి, భూదేవి అమ్మవారు పల్లకిపై ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకుంటారు. పరిణయోత్సవ వేదిక చుట్టూ ఏర్పాట్లు చేస్తున్నారు. దేవతామూర్తులు, పుష్పాలతో అలంకరిస్తున్నారు. వివిధ రకాల దేవతా మూర్తుల విద్యుత్ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం కురిసిన కుంభవృష్టి వర్షం వల్ల పద్మావతి పరిణయోత్సవ వేదిక పనుల కోసం వేసిన సెట్టింగులు కూలిపోయాయి. వెనువెంటనే ఆదివారం ఉదయం నుంచి పనులు వేగంగా నిర్వహిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top