టీటీడీ సిబ్బంది దాష్టీకం, భక్తుడు సీరియస్
తిరుపతి : వెంకన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది దాష్టీకానికి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.... నిన్న సర్వదర్శనం క్యూలైన్లో శ్రీవారి దర్శనార్థం వెళుతున్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పద్మనాభం అనే భక్తుడిపై టీటీడీ సిబ్బంది అకారణంగా దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. స్కానింగ్ కేంద్రం వద్ద దర్శనానికి వెళుతుండగా పద్మనాభంపై విజిలెన్సు సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు.
దాంతో అతను అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన పోలీసులు అతనిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. పద్మనాభం పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు విజిలెన్సు సిబ్బందిని, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను, ఒక ఎస్పీఎఫ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.