టీటీడీ కార్యక్రమాల కరపత్రాల విడుదల
విజయనగరం టౌన్: ప్రజలందరిలోనూ ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా భక్తి కార్యక్రమాలను రూపొందించామని టీటీడీ ప్రోగ్రామ్ అసిస్టెంట్ జె.శ్యామ్సుందర్ అన్నారు. తిరుమల, తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలవారీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబరు నెలలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల కరపత్రాలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకటి, రెండు తేదీలలో ఎల్.కోట, భీమాలి, రామాలయాల్లో స్థానిక భజన మండలికళాకారులతో అన్నమాచార్య కీర్తనలు ఉంటాయన్నారు. 3,4 తేదీల్లో జామి మండలం సిరికివానిపాలెం, గొడుకొమ్ము రామాలయం, 6,7 తేదీల్లో నెల్లిమర్ల మండలం రామతీర్థం, బెరైడ్డి వీధి, జరజాపుపేట రామాలయాల్లో హరికథ, సంగీతం, భజనలు ఉంటాయన్నారు.
8,9,10,11,12 తేదీల్లో బొబ్బిలి మండలంలోని రాముడు వలస, పిరిడి, చింతాడ, కమ్మవలసల్లోనూ, 13, 14, తేదీల్లో సీతానగరం లక్ష్మీపురం, అజ్జాడలోనూ, 15, 16 ,17, 18, 19, తేదీల్లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి, చిన బొండపల్లి, దిబ్బగుడ్డివలస హరిజన వాడల్లో గోపూజలు, హరికథలు, భజన కార్యక్రమాలు రామాలయాల్లో నిర్వహిస్తామన్నారు. 21, 22, 23, 24, 25 తేదీల్లో పూసపాటిరేగ , భోగాపురం, రెల్లివలస, ముక్కాం, రామాల యాల్లోనూ, 26, 27, 28, 29 తేదీల్లో ఎల్కోట దిగువవీధి రామాలయం, కొత్తవలసలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. వీటితో పాటూ పురాణ ప్రవచనాలను కోలా నాగ గంగాధరరావు, జామి, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, పార్వతీపురం మండలాల్లో చెబుతారన్నారు. భక్తులందరూ కార్యక్రమాలకు హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని కోరారు. కార్యక్రమంలో సాయి రామభద్రరాజు, సిహెచ్.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.